పూసగుప్పలో మొబైల్ హాస్పిటల్, అంబులెన్సు సేవలు ప్రారంభం
- కలెక్టర్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం
- అదివాసీ గ్రామాల్లో పోలీసుల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే తెల్లం, కలెక్టర్ పాటిల్
చర్ల మండలంలోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన పూసుగుప్పలో శుక్రవారం
మొబైల్ హాస్పిటల్, అంబులెన్స్
సేవలను ప్రారంభమయ్యాయి. ఈ సేవలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్
జితేష్ వి పాటిల్, ఎస్పీ
రోహిత్ రాజులతో కలిసి ప్రారంభించారు. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ నిధులు కోటి
రూపాయలతో ఈ మొబైల్ హాస్పటల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
మాట్లాడుతూ చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల
సంక్షేమం కోసం ఎస్పీ రోహిత్ రాజుఆధ్వర్యంలో పోలీస్ శాఖ విశేష సేవలు అందిస్తుందన్నారు.
పూసుగుప్ప పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే, భద్రాచలం, కొత్తగూడెం పట్టణాలకి
వెళ్లడానికి ఒకప్పుడు సరైన రహదారి కూడా లేదని, కానీ ఇప్పుడు ఇదే పూసుగుప్ప గ్రామానికి
చర్ల నుండి అరగంటలోనే చేరుకునే విధంగా రహదారిని నిర్మించారన్నారు. ఇప్పుడు హాస్పిటల్ను
కూడా ప్రారంభించడం జరిగిందని, దీనిలో చర్ల పోలీసుల
కృషి ఎంత గానో ఉందని కొనియాడారు. ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ
ఆసుపత్రి సేవలను పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా
కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు
ఆదివాసీ ప్రజలకు అందజేయడంలో జిల్లా పోలీసుల కృషి అభినందనీయమన్నారు. మావోయిస్టు
ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస
సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు. ఎస్పీ
రోహిత్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఏజెన్సీ ప్రాంతవాసులకు ఎప్పుడూ
అండగా ఉంటుందని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని
పరిష్కరించడంలో స్థానిక పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ఆదీవాసీలకు అందుబాటులో
ఉంటారని అన్నారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ తమ
ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సరిహద్దు చత్తీస్గడ్ రాష్ట్ర
గ్రామాలైన రాంపురం, భీమారం
ప్రజలు కూడా ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్బంగా కోరారు. అనంతరం, ఇటీవల పూసుగుప్ప నుండి
రాష్ట్ర సరిహద్దు వరకు నూతనంగా నిర్మితమైన బీటి రోడ్డును పరిశీలించారు. ఈ
కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, చర్ల ఇన్స్పెక్టర్ రాజు వర్మ, స్పెషల్ బ్రాంచ్
ఇన్స్పెక్టర్స్ చెన్నూరి శ్రీనివాస్, ఇ. శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment